అస్తిత్వ సమాధులపై పోలవరం - మైపతి అరుణ్ కుమార్
‘మమ్మల్ని ముంచే ప్రజాస్వామ్యం మాకొద్దని’ పోలవరం ప్రాజెక్టుతో నిర్వాసితులవుతున్న ఆదివాసులు నినదిస్తున్నారు. సమ్మక్క, సారలమ్మ, కొమరం భీం, బిర్సాముండా, సోయం గంగులు పోరాట సంప్రదాయాన్ని కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. మా గూడెంలో మా రాజ్యం. ‘జల్, జంగిల్, జమీన్’ మాదే అని ఉద్యమిస్తున్నారు.
దేశ చరిత్రలో మూడు లక్షల మంది ఆదివాసులను ప్రజాస్వామ్య పద్ధతిలో ఊచకోత కోయడానికి మార్గం సుగమం చేసిన చీకటి రోజు 2014, జూలై 11. ప్రస్తుత ప్రజాస్వామ్య పాలన భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని నిరూపించిన రోజు అది. రాజ్యాంగంలోని జీవించే హక్కును ఆదివాసులకు అందకుండా కాలరాసిన రోజు. గత యూపీఏ ప్రభుత్వం తయారు చేసిన పోలవరం ముంపు ప్రాంతాల ఆర్డినెన్స్ను ప్రస్తుత ఎన్డీఏ యాంలో పార్లమెంటులో ఆమోదం పొందిన రోజు. పోలవరం పేరిట ఆదివాసీలకు ప్రజాస్వామ్య పాలకులు వేసిన శిక్ష అది.
సమాజం మొత్తం అనుకున్నట్లే కేవలం గ్రామాలు, అడవులు, పురావస్తు ఆధారాలు, భద్రాచల రామాలయ భూముల్ని మాత్రమే కోల్పోతున్నామా లేక ఇంతకంటే విలువైనవేమైనా జల సమాధి అవుతున్నాయా? అదివాసీ సమూహాల్లో కొన్ని వేల ఏళ్ళుగా వస్తున్న అస్తిత్వ మూలాలు జలసమాధి అవుతున్నాయి. ప్రభుత్వాలు వారి అస్తిత్వానికి ఏం పరిహారం చెల్లిస్తాయి? కోల్పోతున్న వారి అస్తి త్వాన్ని ఏవిధంగా పునర్మిరిస్తాయి? సాధారణంగా ఆదివాసీ సమూహాలు.. ప్రకృతితో మమేకమై, అటవీ ఉత్పత్తుల అనుసంధానంతో, అందుబాటులోని నీటివనరుల ఆధారంగా తమ అస్తిత్వాన్ని సుస్థి రం చేసుకుంటారు. ఆ విధంగా సంప్రదాయబద్ధంగా గ్రామాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సాలోని ముంపునకు గురయ్యే 300 ఆదివాసీ గ్రామాలు ఆ విధంగా ఏర్పడినవే. ఖరీఫ్ సీజన్ మొదలవగానే దేశంలో వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతుంది. ఆదివాసీ సమాజంలో దీనికి భిన్నంగా ఉం టుంది. దుక్కులు దున్నటానికి నాగలి కోసం అడవిలో వంక గల బిలుగు చెట్టు కలపను సేకరించి నాగ లి తయారు చేసుకుంటారు. దానికెటువంటి ఖర్చు అవసరం లేదు. పంటచేల రక్షణ కోసం అడవిలో చెట్లతోనే మంచెల నిర్మాణం, కంచె నిర్మాణం చేసుకుంటారు. పశుపోషణ అడవితో ముడిపడి ఉంది. అటవీ ఉత్పత్తులను సేకరించి సంతల్లో విక్రయించి పూట గడుపుకుంటారు. వెదురుతో బొమ్మలు చేస్తారు. అడవి కలపతోనే పూరి గుడిసెల నిర్మాణం చేసుకుంటారు. పండుగలు కూడా ఆయా గ్రామాల పరిసర ప్రాంతాలతో ముడిపడి ఉంటాయి. ఇవేకాక ఆదివాసీ సమాజంలో గట్టు విధానం ఉంటుంది. ముంపునకు గురయ్యే కోయ సమాజంలో 3 నుంచి 7వ గట్టుకు సంబంధించిన ఆదివాసీలున్నారు. ఇందులో ప్రతి గట్టు వారికి అడవిలో ఒక చెట్టు, జంతువు దైవాలుగా ఉంటాయి. మద్ది చెట్టు అడవి కోడి, ఉడుము, మేక, తాబేలు వంటివి. ఏ పండుగ జరిపినా విప్ప చెట్టును వారు ప్రధానంగా పూజిస్తారు. వేట విధానంలో కూడా వేటాడిన మాంసాన్ని నల్లమద్ది చెట్టుకు నైవేద్యంగా పెట్టిన తర్వాతనే తినటం ప్రారంభిస్తారు. గూడెంలోకి సరిపడు పంటలు పండటం కోసం సంప్రదాయబద్ధంగా ఏర్పాటుచేసుకున్న నీటి చెరువులు కుంటల కట్టలపై మైసమ్మ, ఎర్రమ్మలు కొలువుంచుకుంటారు. ఆదివాసుల అణవణువూ వారు శతాబ్దాలుగా బతుకుతున్న ప్రకృతిపై ఆధారపడి ఉంది. పెళ్ళి విధానంలోనూ ఉమ్మడి సాంప్రదాయక జీవన వ్యవస్థ ప్రకృతిలో గల సంబంధాన్ని చూడవచ్చు. పెళ్ళి విధానంలో పచ్చని పందిరి ఏర్పాటుకూ కొన్ని ప్రత్యేక చెట్లను వాడుతారు. ముహూర్తానికి ముందు జిన్న పొరక, పాల పొరకను అడివి నుంచి సన్నాయి వాయిద్యాలతో తీసుకొచ్చి పందిరిపై అలంకరిస్తారు. ప్రధానం పీఠ, కడపలను ఇదే సమయంలో తీసుకొస్తారు. వాటి తయారీకి అడవిలో బతెంగ చెట్టు బెరడునే ఉపయోగిస్తారు. వేరేదాన్ని వాడటానికి వీలులేదు. తాళి కట్టే సమయంలో జమ్మి చెట్టును అడవినుంచి తెచ్చాకే తాళి కడతారు. ఇలా ఆదివాసీ సమా జం ప్రకృతితో పెనవేసుకోయి శతాబ్దాలుగా నడుస్తోంది. అలాంటి ఆదివాసీ అస్తిత్వం పోలవరం ప్రాజెక్టు వల్ల సమాధి కాబోతోంది.
ఉన్నపళంగా వీటన్నింటినీ వదిలి నేడు పోలవరం పేరిట సామ్రాజ్యవాదులకు లాభం చేకూర్చటానికి ఈ గూడేలన్నిటినీ మైదాన ప్రాంతాలకు తరలిస్తే ఆదివాసుల అస్తిత్వమేమవ్వాలి? ప్రభుత్వం ప్రకటించే రూ.10 లక్షల నష్టపరిహారం వారు కోల్పోతున్న జీవితంతో పోలిస్తే ఏపాటిది? మైదాన ప్రాంతంలో పునరావాసం కల్పిస్తే వారు ఎలా బతకాలి? తాగునీరు సైతం మైదానంలో రూ.20 ధర పలుకుతుంటే వారి జీవనం ఎలా సాగాలి? మైదాన ప్రాంతంలో భూముల కోసం కొట్టుకు చస్తుంటే, మాకు భూములు ఎక్కడి నుంచి ఇస్తారు? ఇచ్చినా ఏం పంటలు పండించాలి? అనే ప్రశ్నలు జలసమాధి కాబో తున్న ఆదివాసీలు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. అడవి అనే నీటిలో చేపలాగా బతికే ఆదివాసీని బయటపడేస్తే ఎలా బతుకుతారు? కనీస మానవతా విలువలు లేకుండా వ్యవహరిస్తున్నాయి ఈ ప్రభుత్వం, రాజకీయ పార్టీలు. ఆదివాసీలు జీవించే హక్కును ప్రజాస్వామ్య బద్దంగా కాలరాస్తున్నవి. ప్రజాస్వామ్యబద్దంగా గ్రామ సభల తీర్మానం జరపాలని సూచించే రాజ్యాంగ నిబంధనను కూడా అవి ఉల్లంఘిస్తున్నాయి. అటవీ హక్కులకు సంబంధించిన 1/70 చట్టాన్ని పార్లమెంట్ గేటు దగ్గర పాతర పెట్టి లోపల మాత్రం పోలవరానికి ఆమోదం తెలిపాయి. అస్తిత్వ పోరాటాన్ని అంచనా వేయ డం చాలా కష్టం. నాడు జోలాపుట్ బలిమెల డ్యాంల కింద నిర్వాసితులైన గోండులు ఏమయ్యారో నేటికీ తెలియదు. శ్రీశైలం, నాగార్జునసాగర్ల కింద జల సమాధి అయిన చెంచులు బతికున్నారో లేదో అంచనా లేదు. నేడు ‘పోలవరం’ ముంపునకు గురయ్యే 3 లక్షల కోయ సమాజం కూడా వీరిలాగే ఉనికిలో లేకుండా పోతారనే ఆందో ళన ఉంది. అయితే గతంలో వలె నిరక్షరాస్యతతో నేటి ఆదివాసీ సమాజం లేదు. విద్యా చైతన్యాన్ని, సామాజిక స్పృహను సంతరించుకున్నారు. మమ్మల్ని ముంచే ప్రజాస్వామ్యం మాకొద్దని పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులవుతున్న ఆదివాసులు నినదిస్తున్నారు. సమ్మక్క, సారలమ్మ, కొమరం భీం, బిర్సాముండా, సోయం గంగులు పోరాట సంప్రదాయాన్ని కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. మా గూడెంలో మా రాజ్యం. ‘జల్, జంగిల్, జమీన్’ మాదే అని ఉద్యమిస్తున్నారు. మరో శ్రీకాకుళ గిరిజన రైతాంగ సాయుధ పోరాటం, ఇంద్రవెల్లిలు పునరావృతం అయితే దానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలి.
- మైపతి అరుణ్ కుమార్
అదివాసీ విద్యార్థి సంఘం
అదివాసీ విద్యార్థి సంఘం
Andhra Jyothi dated 31 -07-2014