Pages

Friday, 23 August 2013


www.suryaa.com/index.asp

చెంచులను కబళిస్తున్న బాల్య వివాహాలు
ఆంధ్రప్రదేశ్‌లోని 35 గిరిజన తెగల్లో అత్యంత ప్రాచీనమైన అభివృద్ధికి నోచుకోని దుర్భర దుస్థితిలో ఉన్నాయి తెగ చెంచులు. మనుస్మృతి, వల్లభరా యుడి క్రీడాభిరామం, యామునిడి రాజనీతి, జాషువా గబ్బిలం, దూర్జటి కాళహస్తిశ్వర శతకం మొదలగు రచనలలో చెంచుల ప్రస్తావన ఉంది. ప్రకృతివైద్యంలో సిద్ధ హస్తులు, భవిషత్తులో సంభవించే విపత్తులను ముందుగానే పసిగట్టగల సమర్థులు, ప్రకృతి పరిరక్షకులు చెంచులు. అహార సేకరణ ప్రధాన వృత్తిగా, మహబూబ్‌నగర్‌, ప్రకాశం, కర్నూలు, గుంటూరు, నల్లగొండ జిల్లాల్లోని నల్లమల అటవీ ప్రాంతంలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా జీవిస్తున్నా ఈ తెగలకు మిగతా జన సమూహాలతో కానీ, ఇతర గిరిజన తెగలతో కానీ దగ్గరి పోలికలు లేవు. వీరి మనస్తత్వాలు, అలవాట్లు, మానసిక, శారీరక స్థితిగతులు, సంస్కృతి భిన్నమైనవి. ఈ రోజు గడిస్తే చాలు. రేపటి సంగతి దేవుడెరుగు అనే తత్వం. మనువాద సంస్కృతి, పితృస్వామిక అజమాయిషి, నాగరికసమాజపు పోకడలు ఏ మాత్రం కనిపించని చెంచు సమాజంలో- స్ర్తీలు అత్యంత స్వేచ్ఛాసమానత్వాలు పొందుతున్నారు.

భాగస్వామి ఎంపికలో స్ర్తీకి పూర్తి స్వేచ్ఛ కల్పిం చాయి గిరిజన తెగ చెంచులు. ఇది మహిళా సాధికారతకు దోహదం చేసినా, మరో విధంగా బాల్యవివాహాలకు దారితీసి వారి అభివృద్ధికి ఆటంకంగా తయారై వారి మనుగడను ప్రశ్నార్ధకంగా మార్చివేస్తున్నది. కాలుష్యమెరుగని ప్రశాంత వాతావరణంలో చెంచులు ఎదుర్కొంటున్న, బయటి సమాజానికి తెలియని అనేక సామాజిక రుగ్మతల్లో బాల్యవివాహాలు అత్యంత ప్రమాద కరమైనవి. నాగరిక సమాజానికే పరిమితమనుకున్న బాల్యవివాహాలు ఆదిమ తెగలైన చెంచులలో విపరీతంగా జరుగుతున్నాయి. వారి బతుకులను నిర్దాక్షిణ్యంగా మింగేస్తున్నాయి. వరకట్న బాధలు, పెళ్ళిళ్ళ ఖర్చులు, హంగు ఆర్భాటాలు లేకపొయినప్పటికి నల్లమల అటవి ప్రాంతంలోని చెంచులుండే 46 మండలాల్లో బైర్లూటి నుంచి అప్పాపూర్‌ వరకు అన్ని పెంటలలో దాదాపు ఇదే పరిస్థితి.

అందుబాటులో ఉన్న బడిలో ఐదవ తరగతి వరకు మాత్రమే చదువు సాగించి, అమ్మాయికి పదకొండు, అబ్బాయికి పదమూడు సంవత్సరాల వయసొచ్చేటప్పటికి పెళ్ళి పీటల నెక్కుతున్నారు. బాల్య వివాహాల రక్కసికి బలవుతున్నారు. చెంచు తెగలలో అబ్బాయికి 13 సంవత్సరాల, అమ్మయికి 11 సంవత్సరాల వయసొచ్చిందంటే, తమను తాము స్వతంత్రులుగా భావించుకుంటారు. తమపై తల్లిదండ్రుల అజమాయిషీని ఏ మాత్రం సహించని వీరు, ఇష్టపడ్డ వ్యక్తితో కలిసి వెళ్ళిపోతారు, సహజీవనంచేస్తారు. ఇది చెంచు సమాజానికి అమోదయోగ్యమే. ఈ విషయమై తల్లి, తండ్రి ఏ మాత్రం అభ్యంతరం తెలుపరు. ఒక వేళ ఎవరైన అలా అభ్యంతరపెడితే- వారికి బంధువులు ఆశ్రయం కల్పించి దన్నుగా నిలుస్తారు. వారిని ఒక ఇంటివారిని చేస్తారు. చెంచుల సాంప్రదాయాల ప్రకారం మామ, కోడలు ఒకే కప్పుకింద నిద్రించకూడదనే ఆంక్ష ఆచారంలో ఉన్నందున కొడుక్కి కోడలిని కట్టబెట్టిన మరునాడే వేరు కాపురం పెడతారు. ఇక అప్పట్నుంచి తన కుటుంబ బాధ్యతలను తనే మొయాల్సి ఉంటుంది. పెద్దలు కొంతమేర సహాయ సహకారాలు అందించినా, కుటుంబ వ్యవహారాల్లో ఏ మాత్రం జోక్యం చేసుకోరు.

కోడలితో మాట్లాడే సాహసం అసలు చేయరు. ఇక ఏ మాత్రం పరిణతి చెందని వయసులో భార్య- భర్త హోదా పొందిన ఆ బాల బాలికల కష్టాలు వర్ణనాతీతం. బతుకు తెరువు ఉండదు. ఉండడానికి ఇల్లు ఉండదు. తినడానికి తిండి ఉండదు. చదువు మధ్యలో మానేయడం వల్ల సమాజ పోకడలు తెలియవు. సమాజంలో ఏ విధంగా బతకాలో ఏమాత్రం అవగాహన ఉండదు. మూఢ నమ్మకాలు, ముడి సాం ప్రదాయాల మధ్య రకాల అపోహలతో అనామకులుగా అత్యంత దీనావస్థలో బతుకు లీడుస్తున్నారు. తిండిలేక విపరీత పౌష్ఠికాహారలోపం, రక్తహీనత, మలేరియా, టైఫాయిడ్‌, కామెర్లు, టిబి, రొగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం, గర్భంలోనే సరిగా ఎదగని బిడ్డలు పుట్టడం జరుగుతున్నాయి. మాతా శిశుమరణాలు, పరిశుభ్రత తెలియక వివిధ రకాల జబ్బులు, అనేక అంటువ్యాధులు, సుఖరోగాల బారిన పడుతున్నారు. 13 ఏళ్ళకే పెళ్ళిళ్ళు జరగడం వల్ల 35 ఏళ్ళకే ముసలితనం ఛాయలు కనిపించగా, మరికొందరు అతి చిన్న వయసులోనే భర్తను కోల్పోవడం నల్లమలలో షరా మామూలైపోయింది. చెంచులకు పౌష్ఠికాహార కొరత తీర్చి బాలింతలను పరిపుష్ఠి చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పౌష్ఠికాహార కేంద్రాలు వివిధ కారణాల రీత్యా చెంచుల దరి చేరడం లేదు.
ఎజెన్సిలో ఉన్న వైద్య సేవలు ప్రభుత్వం లెక్కలు చూపించుకోవడానికి మాత్రమే పనికొస్తున్నాయి. ఆధునిక యుగంలో అందుబాటులోకి వచ్చిన వైద్యం, చెంచులకు ఎన్నటికీ అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. దాదాపు 99 శాతం ప్రసవాలు ఆడవిలోనే అత్యంత ప్రమాదకర పరిస్థితుల మధ్య జరిగిపోతున్నాయి. తల్లి పిల్లలు బతకడం దేవుడి మీదే భారం.

సకల సమస్యలకు పరిష్కారానికి మూలమైన విద్య, ఇతరత్రా అనేక సామాజిక కార్యక్రమాలు ముఖ్యంగా బాల్య వివాహాల కారణంగానే చెంచుల దరి చేరలేదు. నిజాం కాలంలో, అమ్రాబాద్‌, మన్ననూర్‌ చెంచుగూడెల్లో, బ్రిటిష్‌ వారు 100 సంవత్సరాల క్రితం కర్నూలు జిల్లా బైరూట్లిలో చెంచుల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఐనప్పటికీ ఇప్పటికీ వారి అక్షరాస్యత 26 శాతం దాటలేకపోతోంది. ప్రస్తుతం ఆ పాఠశాలలు పిల్లలు లేక వెలవెల బొతున్నాయి. పాఠశాలలు వారికి ఆహారం, సబ్బులు అందిచే కేంద్రాలుగా మారిపోతున్నాయి. కారణం- పాఠశాలలో ఉండాల్సిన పిల్లలే పెద్దలై, సంసార బాధ్యతలు నెత్తినవేసుకోవడమే. బాల్య వివాహల వల్ల తలెత్తిన ఇంకొక ముఖ్యమైన దుష్పరిణామం- విపరీత ఆత్మహత్యలు. మోసం, దగా తెలియని చెంచులు కుటుంబ తగాదాలతో నాటు సారాకు బానిసలై, అడవిలోని విషపూరిత ఆకులు, పసర్లు తాగి, మరికొందరు ఉరేసుకుని బలవన్మరణం పొందుతున్న సంఘటనలు చెంచు పెంటల్లో కొకొల్లలు. ఫలితం పిల్లలు అనాథలు కావడంతో ఒక తరం పూర్తిగా అభివృద్ధికి దూరం.
చెంచుల సగటు ఆయుః ప్రమాణం 40-50 సంవత్సరాలంటే నమ్మశక్యం కాని విషయం. అత్యంత స్వల్ప జనాభా కలిగిన, పర్యావరణ పరిరక్షకులైన చెంచుజాతి వారు నశించి పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

No comments:

Post a Comment